నిజమైన పప్పూలెవరు?

నిజమైన పప్పూలెవరు?
======================
పప్పూ అంటే, వ్యవహారిక హిందీభాషలో ‘వెర్రిబాగులోడు/తెలివితేటలు లేనివాడు ‘  అని అర్థం వస్తుంది. 2014 ఎన్నికలముందూ, ఆ తర్వాత కూడా, మోడీ, వెంకయ్య నాయుడు లాంటి జాతీయ నేతలు , రాహుల్ గాంధీని అవహేలన చేస్తూ, అతన్ని పప్పూ అని అనేక మార్లు పిలిచారు. ఇక ఇతర BJP చిన్న స్థాయి నేతలు, వారి మద్దతుదారుల గురించైతే చెప్పక్కర్లేదు. అతన్ని పప్పూ అని పిలవకుండా వీరు ఏ చర్చనూ కొనసాగించలేరు. దీనికి ఆధారాలుగా వీరు చెప్పే అంశాలు – రాహుల్ గాంధీ కొన్నిసార్లు విలేఖరుల ప్రశ్నలకు తడబడ్డాడు. కొన్ని సమావేశాల్లో శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు -ఇలాంటివి. వీటిలో నిజం లేకపోలేదు. విలేకర్లెప్పుడూ ఇబ్బందికరమైన ప్రశ్నలే అడుగుతుంటారు. అట్లే కొన్ని వందలమంది ఆడియన్స్ ఉన్న సమావేశంలో, వారు అడిగే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తెలిసి ఉండాలని రూలేం లేదు. కానీ, ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే – రాహుల్ గాంధీ, ఆ ప్రశ్నల నుండీ పారిపోలేదు. తనకు తానుగానే, ఎదుటి వారికి తనను ప్రశ్నించే అవకాశం ఇచ్చాడు.

ఇలాంటిదే ఓ సమావేశం ఇటీవల సింగపూర్ లో జరిగింది. ఆ సమావేశానికి వచ్చిన శ్రోతల్లో ఒకతను రాహుల్ గాంధీని ఓ ప్రశ్న అడిగాడు. అది – “మీ కుటుంబ సభ్యులు  ప్రధానిగా ఉన్న సమయాల్లో, ప్రపంచ ఆర్థికాభివృద్దితో పోల్చి చూస్తే, దేశ ఆర్థికాభివృద్ది నెమ్మదించింది. అదే ఇతరులు ఉన్నప్పుడు మాత్రం దేశం అత్యంత వేగంగా పురోగమించింది. దీనికి మీరేమంటారు”. ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. రాహుల్ గాంధీని ఇబ్బందిపెట్టాలని, తీవ్రంగా ఆలోచించి తయారు చేసుకున్న ప్రశ్న. అతను అడిగింది కాంగ్రెస్స్ పాలనలో కాదు, కేవలం గాంధీ ల పాలనలో. ఎందుకంటే,ఓవరాల్గా  కాంగ్రెస్ పాలనలోనే దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందనేది ఆర్థికవేత్తలందరూ ఒప్పుకునే విషయమే. కానీ, అతను కాంగ్రెస్ ప్రధానుల నుండీ, గాంధీ ప్రధానుల్ని వేరుచేసి, మిగతా వారు బెస్టు, గాంధీలు మాత్రం వేస్ట్ అన్నట్లు ప్రొజెక్ట్ చేశాడు.  గణాంకాల ప్రకారం చూస్తే, ఇది కొంత వరకూ నిజమే అనిపిస్తుంది. కానీ, అంత మంది ముందు ఓ యువనాయకుడి ముఖంపై ఈ ప్రశ్న అడిగితే, అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. అందుకే, ఆ సభ నిర్వాహకులు( మాడరేటర్) మీరు కావాలంటే, ఈ ప్రశ్నను స్కిప్/ఇగ్నోర్  చేయొచ్చని రాహుల్ గాంధీకి తప్పించుకునే అవకాశం కల్పించారు.    కానీ ఆశ్చర్యకరంగా RG దీనికి సమాధానం చెప్తానన్నాడు. ఓ నిమిషం పాటు ఆలోచించి – ఆ ప్రశ్న అడిగిన వ్యక్తితో ఇలా అన్నాడు. -” మీ ఉద్దేశ్యం ప్రకారం 2004-2014 మధ్య ఉన్న ప్రభుత్వంలో నా కుటుంబం పాత్ర ఏమీ లేదా? “
అంతే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ వ్యక్తి తెల్లమొఖం వేశాడు. ఎందుకంటే, పాత్ర లేదూ అంటే, దానర్థం UPA పాలనలో దేశంలో జరిగాయంటున్న అనేక స్కాంలలో కాంగ్రెస్ పాత్ర లేదని ఒప్పుకున్నట్లే. గాంధీల పాత్ర ఉందీ అంటే, అప్పుడు ఆపైన అడిగిన ప్రశ్నే పూర్తి అవివేకమైనదని తేలిపోతుంది. అభివృద్ధిలో పాత్ర లేదు గానీ, స్కాంలలో/అవినీతిలో మాత్రం పాత్ర ఉంది అని – తెలివైనోల్లు ఎవరూ అనలేరు కదా.
ఈ రకంగా, ప్రశ్నల్ని ఎదుర్కోవడంలో ధైర్యమే కాక, వాటికి స్పాంటేనియస్ గా సమాధానమిచ్చే తెలివితేటలూ ఉన్నాయని, ఇలాంటి అనేక ఇంటర్వ్యూలూ, Question- Answer Sessionల ద్వారా, రాహుల్ గాంధీ ప్రూవ్ చేసుకున్నాడు. అఫ్ కోర్స్, అమ్ముడు బోయిన మీడియా హైలైట్ చేయదు కాబట్టి, RG గురించిన ఇలాంటి పాజిటివ్ న్యూస్ లు చాలామందికి తెలిసే అవకాశం లేదు. చివరికి నిన్నటి సింగపూర్ న్యూస్ ని కూడా, దేశంలోని అత్యధిక సర్కులేషన్ గల Times of India పత్రిక ఎలా ప్రజెంట్ చేసిందో చూస్తే, పత్రికలు ఏ స్థాయికి దిగజారాయో ఇట్టే తెలిసిపోతుంది. ఈ పత్రిక, ఓ వ్యక్తి RGని కష్టమైన ప్రశ్న వేశాడనీ, దానికి RG నీల్లు నమిలాడనీ మాత్రమే రాసింది తప్ప, దానికి అతనిచ్చిన కౌంటర్ సమాధానం గురించి అస్సలు రాయలేదు. TOI దిగజారుడే ఈ రేంజ్లో ఉంటే, ఇక ఇతర ప్రాంతీయ పత్రికలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.
మీడియా సంగతి అటుంచితే, ఇప్పుడో చిన్న, ఆసక్తికర ప్రశ్న-
మోడీ గత నాలుగేళ్ళలో ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్ని ఇచ్చాడు? ఎన్ని Question- Answer Sessionలు అంటెండ్ అయ్యాడు.
దానికి సమాధానం  – ZERO. గుండు సున్నా.
గతంలో ఓ సారి కరన్ థాపర్ ఇంటర్వ్యూలో, అతను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, స్టూడియో నుండీ అర్థాంతరంగా పారిపోయాడు. ఆ వీడియోలు ఇంకా యూటూబ్ లో ఉన్నాయి. ఆసక్తి ఉన్నోల్లు చూసి తరించొచ్చు.
అట్లే మనోడు గతేడాది ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నప్పుడు, అక్కడి ప్రముఖ దినపత్రిక LeMonde మోడీ ఇంటర్వ్యూ కావాలని అడిగింది. దానికి మనోడు ఇచ్చిన సమాధానం విని పాపం వారు షాకయ్యారు. “ముందుగా మీరు అడగదలచుకున్న ప్రశ్నలేవో రాసివ్వండి. వాటిలో ఏ ఏ వాటికి  సమాధానాలివ్వాలో నేను డిసైడ్ చేసుకుంటా. మీరు వాటిని మాత్రమే అడగాలి.” – ఇదీ మోడీ గారి ప్రపోజల్. ఈ ప్రపోజల్ విని తిక్కరేగిన ఆ పత్రిక మీరొద్దు,మీ ఇంటర్వ్యూ వద్దు పొమ్మంది. ఆయన్ను ఇంటర్వ్యూ చేస్తామంటే, ఇలాంటి ప్రపోజల్ పెట్టాడు. చూశారా ఎంత విడ్డూరమో అని, దీనిగురించి తన మొదటి పేజీలో రాసింది.
 shukravaram.in
గత నాలుగేళ్ళలోనే కాదు, అంతకు ముందు కూడా మోడీ ఎప్పుడు ప్రెస్ కాంఫరెన్స్లు నిర్వహించింది లేదు. ఏ ఒక్క ఓపెన్ ఇంటర్వ్యూకూ అటెండ్ అయింది లేదు. చేసిందల్లా, అర్నబ్ గోస్వామి లాంటి చెంచాగాల్లతో, ఏ ఏ ప్రశ్నలడగాలో ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని, చూసేవాల్లని వెర్రిబాగులోల్లని చేయడమే.
ఎందుకంటే, తాను చేసేవన్నీ జనాలకు తెలిస్తే, ఇప్పుడిలా  మోడీ జపం చేసేవారెవరూ ఉండరని అతనికి తెలుసు కాబట్టి.  ఉదాహరణకి ఎవరైనా ఈ కింది ప్రశ్నలడిగితే మోడీ పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించండి.
1. దేశం నుండీ జరుగుతున్న బీఫ్ ఎగుమతుల్ని చూసి నా రక్తం మరిగిపోతుందని, ఉత్తరభారతంలోని ప్రతి ఎన్నికల ర్యాలీలోనూ చెప్పి ఓట్లేయించుకున్నారు. మీరు ప్రధాని అయ్యాక, బీఫ్ ఎగుమతుల్లో దేశం రెండో స్థానం నుండీ, ఒకటో స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు మీ రక్తం మరగడం లేదా?
2. గోవా,కేరల, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలప్పుడు, ఆ రాష్ట్రాల్లో ఎలాంటి బీఫ్ బ్యాన్ ఉండదనీ, పైగా అన్నివేలలా సరసమైన రేట్లకే బీఫ్ అందుబాటులో ఉండేలా చూస్తామనీ హామీలెందుకిచ్చారు?
3. ‘హజ్ సబ్సిడీ మైనారిటీ అప్పీజ్మెంట్కే ‘ అని గొంచు చించుకునే మీరు, హజ్ సబ్సిడీని ఎత్తేసి నెలకూడా కాకముందే,  ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో క్రైస్తవులకు ఉచిత ఇజ్రాయేల్ యాత్ర అని ఎలా ప్రకటించారు.
4. సార్, ప్రధాని అభ్యర్థికి ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. మీరు అస్సలు ఏనాడు స్కూల్ కెల్లలేదని చెప్పినా, మీ అభిమానులకు మీపై అభిమానం ఏ మాత్రం తగ్గేది కాదు. అయినా మీరు M.A చేశానని చెప్పారు. మీ యూనివర్సిటీ వారు మాత్రం, ఎన్నిసార్లడిగినా ఆ ఒక్క  సంవత్సరానికి సంబంధించిన సమాచారం ఇవ్వమనీ, అలా ఇస్తే, దేశానికి తీవ్ర నష్టం జరిగిపోతుందనీ అంటున్నారు. ఏంటిసార్ ఇదంతా. కనీసం మీరైనా ఆ సమాచారం ఇవ్వమని వారికి ఎందుకు చెప్పడంలేదు.
5. ప్రధాని కాకముందు GST,ఆధార్,పనికి ఆహార పధకం లాంటీ పధకాలన్నిటినీ , రోజూ పొద్దునా, సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టేవారు. ఇప్పుడేమో అవే పధకాల్ని కొనసాగిస్తున్నారు. అప్పుడు తిట్టిన తిట్లకు ఇప్పుడేమైనా పశ్చాత్తాపం ఉందా?
6. 100 రోజుల్లో నల్లధనం వెనక్కి తెచ్చి , ఒక్కొక్కరికీ 15 లక్షలన్నారు. ఎంతమందికిచ్చారు.
7. ఎంత మంది కాంగ్రెస్ వారిని జైలుకు పంపించారు. రాబర్ట్ వాద్రాను అప్పట్లో అవినీతిపరుడని అంతలా తిట్టారే. మరి ఈ నాలుగేల్లలో అతని మీద కనీసం ఈగకూడా వాలలేదేమి.
8. వెంకటేశ్వర స్వామి కొలువైఉన్న తిరుపతిలో, ఆంధ్రా ప్రత్యేక హోదా గురించి మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయా?
9. నేను గనక ప్రధాని ఐతే, పాకిస్తాన్, చైనా ల అంతు చూస్తానని, సరిహద్దుల్లో మన సైనికులు చనిపోయిన ప్రతిసారీ మీడియా ముందుకు వచ్చేవారే. మరి మీరు ప్రధాని అయ్యాక కూడా అవి ఎందుకు జరుగుతూనే ఉన్నాయి. పిలవకుండా నవాజ్ షరీఫ్ పుట్టినరోజుకు ఎందుకు వెళ్ళారు.
వీటిలో ఏ ఒక్క ప్రశ్నకూ మోడీ దగ్గర సమాధానం లేదు. అందుకే వారు ప్రశ్నల్ని తప్పించుకుని తిరుగుతుంటారు. తప్పించుకు తిరుగువారు ధన్యులు సుమతీ అనే పద్యం ఉండనే ఉంది కదా.
మరి మోడి పప్పూయా.? కాదు, ముమ్మాటికీ కాదు. అతనో బతకనేర్చినోడు. సిస్టం ఎలా పనిచేస్తుందో, దాన్ని తన అవసరాలకోసం ఎలా వాడుకోవాలో, దానిని ఎలా ఆడించాలో బాగా తెలుసుకున్నాడు.వీటన్నిటితోపాటు కాలం కూడా కలిసి రావడంతో, ప్రస్తుతమున్న స్థాయికి ఎదిగారు.
మరి నిజమైన పప్పూలెవరు?
2000 రూపాయల నోటులో చిప్పు పెట్టబోతున్నారనే వాట్సప్ మెసేజీ రాగానే, ఇది ఎలా సాధ్యం అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దానిని మరోపది మందికి ఫార్వర్డ్ చేస్తారే వాల్లు – పప్పూలంటే.
ఆర్ ఎస్ ఎస్ – వీల్లెవరు, వీళ్ళ ఐడియాలజీ ఏమిటీ, వీళ్ళ చరిత్ర ఏమిటీ, దేశ స్వాతంత్రోద్యమంలో వీళ్ళ పాత్రేమిటీ?  ఏనాడూ, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని వీరు, BJPని కంట్రోల్ చేయడమేమిటీ?, దేశంలోని వివిధ వర్గాల ప్రజలపట్ల, రాజ్యాంగం పట్ల వీరి వైఖరి ఏమిటీ?  వంటివేవీ తెలుసుకోకుండా, కనీసం ఆ అణుమానాలు కూడా రాకుండా, ‘అన్ని పార్టీలూ ఒక్కటే ‘ అని పెద్ద మేధావుల్లా స్టేట్మెంట్లు ఇస్తుంటారే – వాళ్ళు – పప్పూలంటే.
 క్రిష్టియన్, ఇస్లాం మతాలు అడుగుపెట్టడానికి ముందు భారత దేశ సమాజం ఎలా ఉండేది?  దేశ విభజనలో ముస్లిం లీగ్ తో పాటు, హిందూ మహాసభ పాత్ర ఎంత? రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండివుంటే, ఇప్పుడు భారత రెలిజియస్ డెమోగ్రఫీ ఎలా ఉండేది వంటి ఆలోచనలేవీ లేకుండా, రిజర్వేషన్లను, అంబేద్కర్ గారినీ, కాంగ్రెస్ పార్టీని తిట్టడమే దేశభక్తనుకుంటారు కదా, వాళ్ళు – పప్పూలంటే.
అలాంటి పప్పూలందరికీ, ఈ పోస్టు అంకితం, ప్రేమతో.
-మహమ్మద్ హనీఫ్.

4 Replies to “నిజమైన పప్పూలెవరు?”

Leave a Reply to myshukravaram Cancel reply

Your email address will not be published.